నల్లని మబ్బులు
నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి,
వెలుతురును మింగేసే చీకటిలా.
కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని
బయలుదేరిన శచీంద్రుని
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీమృదంగ ధ్వనులు.
ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని వెంటబడుతూ,
చుట్టుకుంటున్న విద్యుల్లతల మెరుపులు.
సాయం సంధ్యలో దేవసేనాని మయూరం
పురి విప్పినట్లుగా.
సప్తవర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...
ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటివంతెన వేస్తున్నట్లు
కురిసింది తొలకరి జల్లు.
'శ్రీ' 03/06/2013
No comments:
Post a Comment