Thursday, May 30, 2013

వాడ్రేవు చినవీరభద్రుడు


నా చిన్నప్పుడు మా ఊళ్ళో వైశాఖమాసపు రోజులు చాలా చిత్రంగా ఉండేవి. మధ్యాహ్నందాకా ఎండ మండిపోయేది. ఉన్నట్టుండి కృష్ణమేఘాలు ఆకాశమంతా ఆవరించి వేసవివాన లోకాన్ని తడిపిపొయ్యేది. ఊరూ, అడివీ, కొండలూ మెత్తబడిపోయేవి. సాయంకాలానికి పడమటి ఆకాశం మీద ప్రకాశవంతమైన రంగుపరుచుకునేది. రాత్రికాగానే శుభ్రమైన వెన్నెల పరిమళంలాగా వ్యాపించేది. ఆ సుమనోహరమైన రంగుల్ని పట్టుకోవడానికి నా జీవితమంతా ప్రయత్నిస్తున్నానుగాని ఆ విద్య చాతకావడం లేదు. కాని ప్రాచీన చీనాకవులకి ఆ కౌశల్యం తెలుసనిపిస్తుంది. అందుకని ప్రతి వేసవిలోనూ వాళ్ళను మళ్ళా మళ్ళా చదవకుండా ఉండలేను.

నిన్నసాయకాలం నగరాన్ని తడిపేసినవాన నాకు ప్రాచీన చీనాకవిశ్రేష్టుడు దు-ఫు (712-770) రాసిన కవితని గుర్తుతెచ్చింది. 'చక్కటి వానకు తెలుసు ఎప్పుడు కురవాలో 'అంటాడాయన.

చూడండి ఈ కవిత:


ఒక వసంతకాలపు రాత్రి వానని స్వాగతిస్తూ

చక్కటివానకి తెలుసు ఎప్పుడు కురవాలో
వసంతం నిండుగా వికసించినప్పుడు వస్తుందది

గాల్లోంచి పొంచివస్తుంది, రాత్రిలో ఒదిగివస్తుంది
చప్పుడుచెయ్యకుండా ప్రతిఒక్కటీ మెత్తబరుస్తుంది

నల్లని అడవి, నల్లని దారులు, నల్లమబ్బులు
నదిమీద పడవలో మినుకుమనే ఒంటరిదివ్వె

తెల్లవారుతూనే చుట్టూ ఎర్రటి ఎరుపు,చిత్తడి
పూలగుట్టల్లో మునిగిపోయిన రాజధాని.



30.5.2013

No comments:

Post a Comment